పోలింగ్ రోజున ఏపీ, తెలంగాణలకు వర్ష సూచన

  • తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
  • ఈ ఐదు రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని వెల్లడి
  • పలు చోట్ల వడగళ్ల వాన కురుస్తుందని హెచ్చరిక
ఇటీవల కురిసిన వర్షాలతో తెలంగాణలో వాతావరణం చల్లబడింది. 5 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, తూర్పు విదర్భ, మహారాష్ట్రలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీలోని రాయలసీమల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపింది. 

తెలంగాణలో రానున్న 24 గంటల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రంగారెడ్డి, ములుగు, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. పలు చోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 

ఎన్నికలు జరగనున్న మే 13వ తేదీన కూడా తెలంగాణ, ఏపీల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న అక్కడక్కడ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు మార్కెట్ యార్డ్ లలో వేసిన పంటలు తడిసిపోయాయి.

Rain Alert
Telangana
Andhra Pradesh

More Telugu News